ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్..చికెన్, మటన్, చేపలతో ప్రత్యేక మెనూ

ప్రభుత్వ బడుల్లో పౌష్టికాహార విప్లవం.. కొత్త విద్యా సంవత్సరం నుంచి బ్రేక్ఫాస్ట్తో పాటు ప్రత్యేక మెనూ
హైదరాబాద్, మే 12: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడకుండా, వారికి పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. “ప్రభుత్వ బడి అంటే కేవలం చదువు మాత్రమే కాదు.. ఆకలి తీర్చే అమ్మ ఒడి” అన్న భావనతో కొత్త విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త ఆహార మెనూను అమలు చేయాలని నిర్ణయించింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే ఏ విద్యార్థి కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఈ మార్పులు చేపడుతున్నారు. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనానికి మాత్రమే పరిమితమైన పథకాన్ని మరింత విస్తరించి, ఉదయం పౌష్టికాహారంతో కూడిన బ్రేక్ఫాస్ట్ను కూడా అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
అదేవిధంగా మధ్యాహ్న భోజనంలో పోషక విలువలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను చేర్చనున్నారు. విద్యార్థులకు చికెన్, మటన్, చేపలు, పాలు, రాగిజావ వంటి పౌష్టికాహారం అందించేలా ప్రత్యేక మెనూను రూపొందించినట్లు సమాచారం. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం అందడంతో పాటు విద్యపై మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త మెనూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, హాజరు శాతం, చదువుపై దృష్టి పెరగడంలో కీలక పాత్ర పోషించనుందని అధికారులు భావిస్తున్నారు.
