
మంత్రి సీతక్క పరువు నష్టం దావా.. బీఆర్ఎస్కు కోర్టు షాక్
హైదరాబాద్: అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు వ్యవహారంపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను తప్పుడు ప్రచారంగా పేర్కొంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 10న బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచురించిన పోస్టులను వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది.
ఈ వ్యవహారానికి సంబంధించిన టెండర్ నోటిఫికేషన్, కొనుగోలు ప్రక్రియ, చెల్లింపు వివరాలు సహా అన్ని పత్రాలను పరిశీలించిన న్యాయస్థానం.. రూ.30 కోట్ల అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఒక్కో మొబైల్ ఫోన్ను రూ.11,650 చొప్పున మొత్తం రూ.44.42 కోట్లతో కొనుగోలు చేయగా, రూ.8,499 విలువైన ఫోన్ను రూ.14,499కు కొనుగోలు చేశారంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం నిర్వహించిందని కోర్టు అభిప్రాయపడింది.
మంత్రి సీతక్క ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఈ ఆరోపణలు చేశారన్న వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు పార్టీ సోషల్ మీడియా విభాగంపై మంత్రి సీతక్క పరువు నష్టం దావా దాఖలు చేశారు.
ఈ కేసులో మంత్రి సీతక్క తరఫున అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు నోటీసులు జారీ చేస్తూ వివాదాస్పద పోస్టులను తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది.
