
కరీంనగర్లో కాల్పుల ఘటనపై స్పందించిన కాంగ్రెస్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీలో జరిగిన కాల్పుల ఘటనపై కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు స్పందించారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని, వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దుండగులు షాపులోకి చొరబడి కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన, నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. బాధితులకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు.
ఈ ఘటనపై డీఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సీపీ గౌస్ ఆలం తక్షణమే స్పందించి సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా చర్యలు చేపట్టారని తెలిపారు.
ప్రజలు ఈ ఘటనపై ఎలాంటి ఆందోళన చెందవద్దని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అహర్నిశలు పనిచేస్తున్నారని రాజేందర్ రావు అన్నారు.
