
వీణవంక మండల కేంద్రంలో సోమవారం రాత్రి హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు మోటం చిన్న వెంకటేష్ ఆధ్వర్యంలో, బీరన్న కుటీరం హనుమాన్ స్వాముల సహకారంతో ఏర్పాటు చేశారు.
బీరన్న కుటీరంలో 21 రోజుల హనుమాన్ మాల దీక్షలో పాల్గొన్న 35 మంది స్వాములు భక్తిశ్రద్ధలతో జపాలు, ఆరాధనలు నిర్వహించారు. శోభాయాత్ర ప్రారంభానికి ముందు హనుమాన్ చిత్రపటాన్ని పూలతో అలంకరించి, చందనంతో తిలకం వేశారు. గురు స్వాముల సూచనలతో, కన్నె స్వాముల ఆభరణాలతో స్వామివారిని అలంకరించారు.
సాయంత్రం 9 గంటలకు బీరన్న దేవాలయం వద్ద ప్రారంభమైన శోభాయాత్ర బస్టాండ్, గ్రామ వీధుల గుండా సాగింది. గ్రామ మహిళలు హారతులు పట్టి, టెంకాయలు కొడుతూ స్వామివారికి ఘన స్వాగతం పలికారు. భక్తులు రామ, హనుమాన్ నామస్మరణలతో నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. రాత్రి 12 గంటల వరకు వెంకటేశ్వర, హనుమాన్ ఆలయం వరకు ఈ యాత్ర కన్నుల పండుగగా కొనసాగింది.
ఈ శోభాయాత్రలో గురు స్వాములు ముష్క శ్రీనివాస్, ముద్దేర శ్రీనివాస్, మల్లెత్తుల సదానందం, స్వాములు మహేష్, తిరుపతి, నరేష్, మల్లేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కన్నె స్వాములు సింహ శివ విక్రాంత్ యాదవ్, రాజు, సాత్విక్, అఖిల్, పవన్, శివకుమార్, వెంకట్, సాయి చరణ్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం విశేష భక్తిశ్రద్ధలతో సాగి, గ్రామ ప్రజల హృదయాలను గెలుచుకుంది.
