హైదరాబాద్, మే 11(zindagi9news) : ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఆగడాలను అరికట్టాలని తెలంగాణ విద్యార్థి యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగేలా ప్రవర్తిస్తున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
ఈ విద్యా సంవత్సరం నుండి జీవో నెంబర్ 42 ప్రకారం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ప్రభుత్వమే నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని, ఫీజు పెంపు చేయాలంటే కచ్చితంగా కలెక్టర్, డీఈఓ, పేరెంట్స్ కమిటీ సమ్మతితోనే పెంపు చేయాలన్న ప్రభుత్వ జీవోను తప్పకుండా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. కొన్నిపాఠశాలలు ఈ నిబంధనలను పట్టించుకోకుండా ఏటా 10-20% వరకు ఫీజులు పెంచుతూ, పేద విద్యార్థులకు విద్యను అందని ద్రాక్షగా మార్చుతున్నాయన్నారు.
బేసిక్ సదుపాయాలు లేని పాఠశాలలను సీజ్ చేయాలి
జిల్లా కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేని స్కూళ్లు–విశాల తరగతి గదులు, స్కూల్ గ్రౌండ్, ల్యాబ్లు, గ్రంథాలయాలు, టాయిలెట్లు, అర్హత గల ఉపాధ్యాయులు లేని విద్యా సంస్థలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని, ఈటెక్నో, డీజీ, ఒలంపియాడ్ వంటి అనధికారిక పేర్లతో నడుస్తున్న స్కూళ్లను మూసివేయాలని కోరారు.
పుస్తక దందాలపై శాఖ చర్య తీసుకోవాలి
కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పేరులే చెప్పి పుస్తక వ్యాపారాన్ని నడుపుతున్నా, విద్యాశాఖ స్పందించడం లేదని విమర్శించారు. అదే విధంగా ఐఐటి, నీట్ ఫలితాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న జూనియర్ కళాశాలలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ధర్నాలు, ఆందోళనలు చేయడం తప్పదని హెచ్చరిక
ఈ అంశాల్లో ప్రభుత్వం సకాలంలో స్పందించకపోతే, అనుమతులేని పాఠశాలల ముందు ప్రత్యక్షంగా ధర్నాలకు దిగుతామని విద్యార్థి సంఘం హెచ్చరించింది.
