ఒలింపియాడ్ ఫౌండేషన్ తరగతులలో స్టడీ మెటీరియల్ పంపిణీ
కరీంనగర్: పాఠశాల విద్యాశాఖ కరీంనగర్, అల్ఫోర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒలింపియాడ్ ఫౌండేషన్ తరగతులలో భాగంగా రామడుగు మండలం వెదిరలోని అల్ఫోర్స్ హై స్కూల్ను సందర్శించిన నిర్వాహకులు విద్యార్థులకు స్టడీ మెటీరియల్ మరియు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. వి. నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పామెల సత్పతి, ఐఏఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒలింపియాడ్ ఫౌండేషన్ కోచింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఈ శిబిరంలో 8వ తరగతి & 9వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఉచితంగా విద్యాసాధన వస్తువులు అందజేస్తున్నట్లు తెలిపారు.
మొదటి దశలో 350 మంది విద్యార్థుల నుంచి 80 మంది ఎంపికై ఈ శిక్షణ శిబిరంలో భాగస్వాములవుతుండగా, వారికి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే 21 రోజుల పాటు శిక్షణ, ఉచిత భోజన వసతి కల్పించనున్నట్లు వెల్లడించారు.
ప్రతి రోజు ఉదయం వ్యాయామం, యోగా మరియు సాయంత్రం డ్యాన్స్, ఇతర సృజనాత్మక కార్యక్రమాలతో విద్యార్థుల్లో చురుకుతనం పెంపొందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి, సిహెచ్ విఎస్ జనార్దన్ రావు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
