వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి వనపర్తి రోడ్డుకు రూ. 70 లక్షలు మంజూరు కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధుల కేటాయింపుకు ప్రత్యేకంగా చొరవ చూపిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి పెబ్బేరు పట్టణ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
వనపర్తి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర్, తోమాలపల్లి మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, బుర్రమోని రాములు, వినయ్ కుమార్, రణదిర్ రెడ్డి తదితరులు ఎమ్మెల్యేను కలిసి అభినందనలు తెలియజేశారు.
వారు మాట్లాడుతూ, గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ రహదారి సమస్యను ఎన్నోసార్లు ప్రస్తావించినా పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందించి సమస్యను పరిష్కరించారని, తద్వారా ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు.
పెబ్బేరు నుంచి వనపర్తి మార్గంలో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారని, రహదారి మరమ్మతుల ద్వారా ప్రజలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
