హుజురాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో, నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాల 607 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి & షాదీ ముబారక్ పథకాల కింద రూ.6,07,70,412 విలువైన చెక్కులను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వయంగా పంపిణీ చేశారు.వివరాల ప్రకారం – హుజురాబాద్ మండలానికి 167, జమ్మికుంటకు 233, వీణవంకకు 145, ఇల్లందకుంట మండలానికి 62 చెక్కులు అందాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ఎన్నికల ముందు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి ఒక్కరికి అయినా ఇచ్చిందా?” అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం హామీకి మోక్షం ఎప్పుడో చెప్పాలన్నారు.కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయని, వాటిని నిలిపివేయడం ప్రజల పట్ల అవమానమని అన్నారు. “పథకాల పేర్లు మార్చండి కానీ వాటిని నిలిపెయ్యవద్దు,” అని సూచించారు. ఆరోగ్యశ్రీ, కేసీఆర్ కిట్ వంటి పథకాలను నిలిపివేసిన తీరు దారుణమన్నారు.ఈ కార్యక్రమంలో పీఎస్సిఎస్ చైర్మన్లు పోనగంటి సంపత్, విజయ్ భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వప్న సదానందం, ఇతర నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
