పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో బోధనా, బోధనేతర సిబ్బందితో నిర్వహించిన సమాశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల కరీంనగర్, ఆదిలాబాద్ , నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఎమ్మల్సీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం పట్టభద్రులంతా కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు..
పట్టభద్రుల సమస్యలపై పరిపూర్ణ అవగాహన కలిగిన నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా వారి సమస్యలు పరిష్కరిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పట్టభద్రుల సమస్యలు పరిష్కరించడం ఒక్క కాంగ్రెస్ తోనే సాథ్యమని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించిందని, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టక నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదికే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు. విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలే కాకుండా పట్టభద్రుల సమస్యలు తెలిసిన నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అసవరం మనందరిపై ఉందన్నారు. ఒక అధ్యాపకునిగా జీవితాన్ని ప్రారంభించిన నరేందర్ రెడ్డి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధిపతిగా ఎదిగిన తీరు యువతకు ఆదర్శమని కవ్వంపల్లి సత్యనారాయణ కొనియాడారు.
