
రూ. 16,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మంథని సబ్ రిజిస్ట్రార్
పెద్దపల్లి, ఫిబ్రవరి 20 (జిందగీ9 న్యూస్):
పెద్దపల్లి జిల్లా మంథనిలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. ఒక భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారంలో లంచం డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్ మరియు ఒక ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
అసలేం జరిగిందంటే:
మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న కాసర్ల రాజేందర్, ఒక ఫిర్యాదుదారుడు కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు గాను లంచం డిమాండ్ చేశారు. ఇందుకోసం సదరు అధికారి, ఒక ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ అయిన రషీద్ ద్వారా రూ. 16,500/- లంచం తీసుకుంటుండగా తెలంగాణ ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో కలకలం రేపింది.
