
మరో చిన్నారి ప్రాణం బలిగొన్న చైనా మాంజ
హైదరాబాద్లో విషాద ఘటన
హైదరాబాద్, కూకట్పల్లి : చైనా మాంజ మరో చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది.వివేకానంద నగర్ సమీపంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో ఐదేళ్ల చిన్నారి నిష్విక ఆదిత్య గొంతుకు చైనా మాంజ చిక్కుకుంది. ఒక్కసారిగా పాప అరవడంతో వాహనం ఆపి పరిశీలించగా, మాంజ గొంతుకు బిగుసుకుపోయినట్లు గుర్తించారు.మాంజ వల్ల తీవ్ర రక్తస్రావం జరగడంతో వెంటనే చిన్నారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చైనా మాంజ వాడకం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
