
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరామ్పల్లి గ్రామంలో ఇంటర్ విద్యార్థిని అర్చన(16) మృతి కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొదట కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల లోతైన దర్యాప్తులో ఇది ఆత్మహత్య కాదని, పరువు హత్యగా నిర్ధారణ అయింది. మృతురాలు అర్చనకు అదే గ్రామానికి చెందిన, ఇదివరకే వివాహం అయిన యువకుడితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ విషయం గ్రామంలో వెలుగులోకి వస్తే కుటుంబ పరువు పోతుందన్న భయంతో తల్లిదండ్రులు ముందస్తు ప్రణాళికతో కూతురిని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తండ్రి రెడ్డి రాజు, తల్లి లావణ్య కలిసి అర్చనకు బలవంతంగా పురుగుల మందు తాగించి, అనంతరం గొంతు నులిమి చంపినట్లు విచారణలో తేలింది. అనంతరం సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు తప్పుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు పోలీసుల విచారణలో నేరాన్ని ఒప్పుకోవడంతో అర్చన తల్లిదండ్రులపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం సైదాపూర్ పోలీస్ స్టేషన్లో హుజూరాబాద్ ఏసీపీ మాధవి కేసు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్, సైదాపూర్ ఎస్సై తిరుపతి పాల్గొన్నారు.
