
హైదరాబాద్, నల్లకుంట: అనుమానంతో భార్యను హత్య చేసిన దారుణ ఘటన నగరంలో కలకలం రేపింది. హైదరాబాద్లోని నల్లకుంట ప్రాంతంలో భర్తే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, వెంకటేశ్ తన భార్య త్రివేణిపై అనుమానంతో ఇంట్లోనే పిల్లల ముందే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కూతురిని కూడా మంటల్లోకి తోసివేసి, కుమారుడితో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు.
తీవ్రమైన మంటల్లో చిక్కుకున్న త్రివేణి అక్కడికక్కడే పూర్తిగా కాలిపోయింది. స్వల్ప గాయాలతో బయటకు పరుగులు తీసిన కూతురు కేకలు వేయడంతో పాటు, ఇంటి నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన స్థానికులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లేలోపే త్రివేణి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
త్వరిత చర్యలు చేపట్టిన పోలీసులు 12 గంటల్లోనే నిందితుడు వెంకటేశ్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు.
