
జూలూరుపాడు లో డయాలసిస్ కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి: AIYF
జూలూరుపాడు, అక్టోబర్ 13 (Zindagi9News రిపోర్టర్: రాము నాయక్): జూలూరుపాడు పీహెచ్సీలో డయాలసిస్ సెంటర్ లేకపోవడంతో పేద ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.కే. చాంద్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న 50 మంది రోగులు సకాలంలో చికిత్స అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
జిల్లా కేంద్రం కొత్తగూడెం, ఖమ్మం ఆసుపత్రుల్లో బెడ్లు లభించక డయాలసిస్ పేషెంట్లను వెనక్కి పంపుతున్న పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. గత మూడు సంవత్సరాల్లో సరైన చికిత్స అందక జూలూరుపాడు మండలానికి చెందిన 12 మంది మరణించారని తెలిపారు.
పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక సమస్యల కారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందలేక ఇంటికే పరిమితమవుతున్నారని చాంద్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు. జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కోసం స్థానిక శాసనసభ్యుడు రాందాస్ నాయక్ తక్షణ చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ సేవను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.
