జడ్పీహెచ్ఎస్ పాపకొల్లు పాఠశాలలో మానవతా విలువలపై అవగాహన సదస్సు

జిందగీ9న్యూస్, అక్టోబర్ 23 (వైరా నియోజకవర్గ రిపోర్టర్: రాము నాయక్)
జూలూరుపాడు మండలంలోని జడ్పీహెచ్ఎస్ పాపకొల్లు పాఠశాలలో బంగారు తల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానవతా విలువలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వక్తగా రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీత, మోటివేషనల్ స్పీకర్ వై. సురేంద్ర పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించాలంటే సమయం, నిద్ర, శ్రమలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు. “లక్ష్యం లేని జీవితం, గమ్యం లేని పడవ ప్రయాణంలాంటిది” అని ఆయన ఉపమానం ఇచ్చి విద్యార్థులను ప్రేరేపించారు.
కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మేరా సాహెబ్ మాట్లాడుతూ — ఈ రోజుల్లో విలువలు తగ్గిపోతున్న ఈ తరుణంలో, విద్యార్థుల్లో మానవతా విలువలను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన బంగారు తల్లి ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమం ముగింపు సందర్భంగా బంగారు తల్లి ఫౌండేషన్ తరఫున విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
