
గ్రామ పంచాయతీ ఎన్నికలు: ఐదుగురికి మించి గుమికూడరాదు
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 5 మండలాల్లో నిషేధాజ్ఞలు
కరీంనగర్, డిసెంబర్ 15:
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 17న జరగనున్న మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిషేధాజ్ఞలు అమలు చేశారు. శాంతిభద్రతలు కాపాడటం, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 163 కింద ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు.
వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, వి.సైదాపూర్ మండలాల పరిధిలో ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడటం, సమావేశాలు నిర్వహించడం పూర్తిగా నిషేధించబడింది.
ఈ ఆంక్షలు డిసెంబర్ 15 సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 17 బుధవారం రాత్రి 11:59 గంటల వరకు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కమిషనర్ కోరారు.
