జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన కూడలుల్లో ఒకటైన కొత్తపల్లి జంక్షన్ను అభివృద్ధి చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. బుధవారం రోజున ఆయన ఈ జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇల్లందకుంట, ధర్మారం, కొత్తపల్లి మార్గాల్లో ప్రయాణించే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జంక్షన్ నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే రూ.15 లక్షల నిధులు మంజూరు కాగా, మిగిలిన నిధుల కోసం CDMAకు లేఖ రాశామని తెలిపారు.
ఇది పూర్తయిన వెంటనే జమ్మికుంట అభివృద్ధి దిశగా మరో మెట్టు ఎక్కినట్లు అవుతుందన్న ఆయన, ఈ కూడలి దారి పట్టే ప్రాంత ప్రజలకు నూతన రూపాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, ఏఈ నరేష్, టి.పి.ఓ శ్రీధర్, ఆర్.ఐ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
