
జూలూరుపాడు, జూన్ 11 (జిందగీ 9 న్యూస్ రిపోర్టర్: రాము నాయక్) : జూలూరుపాడు మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో నిర్మించబడిన పశువైద్యశాల భవనం పూర్తిగా శిధిలవస్థకు చేరుకుంది. ఈ భవనం ఎప్పుడు కూలిపోతుందోనన్న భయంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో, భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బానోత్ దుర్గాప్రసాద్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ – “శిధిలావస్థలో ఉన్న ఈ భవనాన్ని వెంటనే కూలగొట్టి, కొత్త పశువైద్యశాల భవనాన్ని నిర్మించాలని” కోరుతూ మండల ఎంపీడీవో, డిస్ట్రిక్ట్ వెటర్నరీ డాక్టర్, కలెక్టర్, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పించామన్నారు.
గత సంవత్సరంలో కలెక్టర్ ఈ అంశంపై స్పందించి “కొత్త భవనం నిర్మాణానికి కృషి చేస్తానని” హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ కూల్చివేత లేదా కొత్త భవన నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
“ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు కలసి, కొమ్ముగూడెంలోని పశువైద్యశాల భవనాన్ని కూలగొట్టి, ప్రజలకు అవసరమైన పశుసంరక్షణ సేవలు అందించే విధంగా కొత్త భవన నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలని” బానోత్ దుర్గాప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
ప్రజలు తమ పశువులకు చికిత్స కోసం భద్రతా రహిత భవనంలోకి వెళ్లాల్సిన అవసరం రాకుండా చూడాలని, దీనిపై జిల్లా పరిపాలన వ్యవస్థ వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
