వావిలాలపల్లి, మార్చి 13: హోళి రంగుల పండుగ జీవితాల్లో వెలుగులు నింపే పవిత్రమైన వేడుక అని, సమాజంలో ఆనందం, ప్రేమ, వాత్సల్యాన్ని పెంపొందించే పండుగగా నిలుస్తుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీటాట్స్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన “అల్ఫోర్స్ హోళి కేళి” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిఒక్కరూ సుఖసంతోషాలతో జీవనం కొనసాగించాలని, ఆర్థికంగా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. నేటి సమాజంలో మానవ బంధాలు దూరమవుతున్నాయని, ప్రేమా వాత్సల్యం తగ్గిపోతుందనే ఆందోళన వ్యక్తం చేస్తూ, సోదర భావంతో మెలిగి ఇతరులకు మేలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు.
హోళీ పండుగకు ముందు రోజు కామదహన కార్యక్రమాన్ని వీధుల ప్రధాన కూడళ్లలో సామూహికంగా నిర్వహించాల్సిన అవసరముందని చెప్పారు. పండుగల ప్రాశస్త్యాన్ని గుర్తుంచుకుని వాటి విశిష్టతను ఇతరులకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించారు.
సమాజంలో వివిధ రకాల వ్యక్తులు ఉంటారని, చెడు గుణాలను వదిలిపెట్టి మంచి మార్గాన్ని అవలంభించేందుకు హోళీ ప్రేరణగా నిలవాలని అభిప్రాయపడ్డారు. సహజసిద్ధమైన రంగులతో హోళీ జరుపుకోవాలని, మత సామరస్యానికి ఇది ఒక ప్రతీకగా నిలుస్తుందని తెలియజేశారు.
హోళీ వేడుకల్లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
విద్యార్థులు ప్రదర్శించిన “హోళీ హమారా రంగోలి”, “హోళీ హోతే హే హమారే విశ్వమే”, “చూడమ్మ రంగుల పండుగ హోళీ పండుగ”, “హోళీ కావాలి మనకు సిరుల పండుగ” నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని వేడుకలను మరింత రంగారంగులుగా మార్చారు.
