ఈ సృష్టిలో పవిత్రమైన జీవి ఏదైనా ఉందంటే, అది ఆవులే అని రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ప్రేమ్ సాగర్ యాదవ్ అన్నారు. ఆవులు అంతరించిపోతే అనేక అనర్థాలు సంభవించే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత కాలంలో రైతుల వద్ద ఆవులు తగ్గిపోతున్నాయి, గోశాలలో ఉంటూ గోశపడుతున్నాయని వ్యాఖ్యానించారు. గోశాలలను వ్యాపారంగా మార్చడం సమంజసం కాదని, పశువులను బంధించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. చిన్న పక్షిని కూడా పంచరంలో పెట్టరాదని పెద్దలు చెబుతుంటే, పవిత్రమైన ఆవులను ఎలా బంధిస్తారు? అని ప్రశ్నించారు.
ఆవులు రైతులకు అప్పగించాలి
ఆవులను గోశాలలో బంధించడం కాకుండా, రైతులకు అప్పగిస్తే రైతుల బాగు, ప్రకృతి అభివృద్ధి జరుగుతాయని ఆయన తెలిపారు. ఆవుల మలమూత్ర ధార భూమిని సారవంతం చేస్తుంది, దీంతో పండించిన పంటలు ఆరోగ్యకరంగా ఉంటాయని చెప్పారు.
“ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఆవులను ప్రకృతిలో ఉండేలా చూడాలి. భూ సంరక్షణ, గో సంరక్షణ, వన సంరక్షణ ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం” అని ఆయన పిలుపునిచ్చారు.
రైతులకు ఉచితంగా ఆవుల పంపిణీ
రైతు సంక్షేమ సేవా సంఘం ద్వారా రైతులకు ఉచితంగా ఆవులను పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించి, వ్యాధుల లేని భావితరాలకు బాటలు వేయాలని కోరారు.
