
మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లో మోతీలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, యువ రాష్ట్రం ప్రపంచ స్థాయి పోటీలో ముందుకు సాగుతోందని, విద్యారంగంపై ఎవరు ఊహించని రీతిలో పెట్టుబడులు పెడుతున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 25 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్లతో ఒక్కో పాఠశాల నిర్మాణం, 104 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీ సిలబస్ను పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా రూపొందించడం జరుగుతోందని తెలిపారు.
చాకలి ఐలమ్మ పేరిట మహిళా విశ్వవిద్యాలయానికి రూ.500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ISB విద్యార్థులు రాష్ట్రానికి మార్గనిర్దేశం చేయాలని సూచించారు.
మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ సహకారం కేవలం విరాళం మాత్రమే కాక, భవిష్యత్తుపై పెట్టుబడి అని అన్నారు. ISB 6,000 మంది ప్రొఫెషనల్స్కు శిక్షణ ఇవ్వడం ప్రశంసనీయమని, తెలంగాణ ప్రభుత్వానికి ISB భాగస్వామిగా ఉంటుందని తెలిపారు. “తెలంగాణ రైజింగ్-2047” విజన్ డాక్యుమెంట్ ద్వారా మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధిస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
