అక్షయ తృతీయను పురస్కరించుకుని సేవా కార్యక్రమం
వీణవంక, ఏప్రిల్ 30 (zindagi9news) :వీణవంక మండల కేంద్రంలోని గొల్ల, కురుమల ప్రాంతాల ఇలవేల్పైన బీరన్న దేవాలయంలో హనుమాన్ భక్తులు అక్షయ తృతీయను పురస్కరించుకుని బుధవారం ఆలయాన్ని శుభ్రపరిచారు. దేవాలయ ప్రాంగణాన్ని దుమ్ము, ధూళిలేనిదిగా తీర్చిదిద్దారు. గంటల తరబడి నీటితో ఆలయాన్ని శుభ్రపరచినట్లు భక్తులు తెలిపారు.
ప్రతి ఏడాది హనుమాన్ మాలదారులు ఈ ఆలయంలో కూటీరాలు ఏర్పాటు చేసుకుని, హనుమాన్ పీఠాన్ని ప్రతిష్టాపన చేస్తూ 21 రోజుల పాటు ఉపవాస దీక్ష, స్నానం, శ్రీరామ నామ జపం, భజనలతో భక్తిశ్రద్ధలతో ఆరాధన చేస్తారు. మధ్యాహ్నం భిక్ష స్వీకరణ, సాయంత్రం భజన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, కొండగట్టు, భద్రాచలం, ఇల్లందకుంట వంటి వైష్ణవ క్షేత్రాలను సందర్శించి చివరగా హనుమాన్ జయంతి సందర్భంగా మాల విరమణ చేస్తారు.
ఈ సందర్భంగా మాల ప్రారంభానికి ముందు ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో ముష్కి శ్రీనివాస్, ముద్దెర శ్రీనివాస్, మల్లెత్తుల సదానందం, బొమ్మ శంకర్, కొలుపుల మహేష్, తాళ్ల పెళ్లి అఖిల్, కొలుపుల శివ, తాళ్ల పెళ్లి పవన్ కుమార్, తాళ్లపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
