హైదరాబాద్: తెలంగాణ పోలీసు కుటుంబాల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (YIPS) వెబ్సైట్ yipschool.in ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) లో జరిగిన కార్యక్రమంలో వెబ్సైట్తో పాటు సమగ్ర సమాచారంతో కూడిన బ్రోచర్ను సీఎం ఆవిష్కరించారు.

2025-26 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు
రాబోయే 2025-26 విద్యా సంవత్సరం నుంచి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పిల్లల స్కూల్ యూనిఫామ్ తో పాటు ఇతర సౌకర్యాలను పరిశీలించారు. సైనిక్ స్కూల్ తరహాలో ఈ స్కూల్ ను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
పోలీస్ అమరుల కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యత
ఈ స్కూల్లో అడ్మిషన్ల విషయంలో పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే విద్యా విధానంలో కొత్త ఒరవడి అవలంభించాలని, క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ నిర్మాణం
పోలీస్ కుటుంబాల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాల్లో విద్యను అందించాలనే లక్ష్యంతో గత ఏడాది అక్టోబర్ 21న భూమిపూజ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు డీజీపీ (ఆపరేషన్స్) స్టీఫెన్ రవీంద్ర సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మరిన్ని వివరాలకు: yipschool.in
