మూడు కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు, పలువురి ప్రశంసలు
జమ్మికుంట, మే 1(zindagi9news):
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏప్రిల్ నెలలోనూ ఆస్తి పన్ను చెల్లింపుపై 5 శాతం రిబేట్ కేటాయించబడింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లు, 151 మున్సిపాలిటీల మధ్య నిర్వహించిన వసూళ్లలో జమ్మికుంట మున్సిపాలిటీ అత్యుత్తమ ప్రదర్శన చూపించి 55.04 శాతం వసూళ్లతో ప్రథమ స్థానంలో నిలిచింది.
ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, జమ్మికుంట ప్రజల సహకారం, ప్రజాప్రతినిధులు, వార్డు అధికారుల సమష్టి కృషి వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. కొంతమంది నివాసితులు స్వయంగా బిల్ కలెక్టర్లకు, వార్డు ఆఫీసర్లకు ఫోన్ చేసి పన్ను చెల్లించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
పన్ను వసూళ్లపై అవగాహన కల్పిస్తూ మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు లాభాలను వివరించారని, అందుకే జమ్మికుంట మున్సిపాలిటీ రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని అధిరోహించగలిగిందన్నారు. ఈ గౌరవం సాధించినందుకు CDA MA తదితర అధికారులు ఫోన్లో అభినందనలు తెలియజేశారన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం జమ్మికుంట అభివృద్ధికి మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు కమిషనర్ తెలిపారు. ఈ స్థానం సాధించేందుకు కృషిచేసిన మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, వాణిజ్య సంస్థలు, పౌరులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, ఆర్ఐ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
