
జమ్మికుంటలో బీసీ రిజర్వేషన్ల సాధనకై పోస్టర్ ఆవిష్కరణ – 19న భారీ బీసీ సదస్సు
జమ్మికుంట : రేపు ఇందిరానగర్లోని దినేష్ కన్వెన్షన్ హాల్లో జరగనున్న “బీసీ హక్కులు బీసీలకే దక్కాలి – బీసీ రిజర్వేషన్లు ప్రజాస్వామిక హక్కే” అనే నినాదంతో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. తిరుపతయ్య ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ సదస్సుకు మద్దతుగా దూదేకుల నూర్భాష జమ్మికుంట మండల అధ్యక్షుడు మహమ్మద్ బందే అలీ ఆధ్వర్యంలో పోస్టర్ను గుల్జార్ మస్జిద్ (జామా మస్జిద్) అధ్యక్షుడు హుస్సేన్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మహమ్మద్ బందే అలీ— బీసీ రిజర్వేషన్ల సాధన కోసం నిర్వహిస్తున్న భారీ సదస్సుకు యువతి–యువకులు, మహిళలు, విద్యార్థులు, బీసీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు, BC–A, B, E వర్గాలకు చెందిన వారందరూ భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ సదస్సులో రిటైర్డ్ IAS అధికారి, 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి నాయకులు టి. చిరంజీవిలు, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ మురళీ మనోహర్, మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్. జీవన్ కుమార్, సామాజిక న్యాయ వేదిక నాయకులు రంగు రాజేశం పాల్గొననున్నట్లు తెలిపారు.
బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, మహిళలు, వివిధ రాజకీయ పార్టీల బీసీ నాయకులు అందరూ కలిసి తమ న్యాయమైన హక్కుల కోసం 42 శాతం రిజర్వేషన్లను అన్ని ప్రభుత్వాలు చట్టబద్ధం చేయాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, స్థానిక సంస్థలు, చట్టసభలలో జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలని, కోర్టులు అడ్డుకాకుండా రాజ్యాంగ పరిరక్షణతో ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర సంస్థల్లోను, ప్రైవేట్ రంగంలోను రిజర్వేషన్ల పెంపు అవసరమని పేర్కొన్నారు.
రాజకీయ రంగంలో కూడా A, B, C, D వర్గీకరణ అమలు చేసి తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. అన్ని స్థానాల్లో మహిళలకు వారి దామాషా ప్రకారం అవకాశాలు ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పెంచిన రిజర్వేషన్లకు అన్ని పార్టీలు కలిసి చట్టబద్ధత కల్పించాలని పిలుపునిచ్చారు.
“బీసీలకు 42% రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించాలి”
జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ అనంతరం మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. తిరుపతయ్య మాట్లాడుతూ—
విద్య, ఉద్యోగ, ఉపాధి, స్థానిక సంస్థలలో బీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 19వ తేదీ బుధవారం జరగనున్న బీసీ సదస్సుకు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మస్జిద్ ఇమామ్ జహీరుల్ ఖాద్రి, వహీద్, అక్బర్, అలీం, అష్రఫ్, సజ్జాద్ మహమ్మద్, రషీద్, VR చారి, స్టార్ మొబైల్స్ ఫక్రోద్దీన్, షరీఫ్, అరీఫ్ అబ్బు తదితరులు పాల్గొన్నారు.
