
రేపటి నుండి పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభం — కాటన్ అసోసియేషన్ సమ్మె విరమణ
జమ్మికుంట: పత్తి పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన చర్చలు సానుకూల ఫలితాలు ఇవ్వడంతో, తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ నిరవధిక సమ్మెను విరమించింది. మంగళవారం కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో జరిపిన భేటీలో సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మంత్రివర్యులు హామీ ఇవ్వడంతో సమ్మె ఉపసంహరించుకున్నారు.
దీంతో (19.11.2025) బుధవారం నుండి జమ్మికుంట మార్కెట్ యార్డు పరిధిలో పత్తి క్రయవిక్రయాలు యథావిధిగా పునఃప్రారంభం కానున్నాయి. అలాగే జిన్నింగ్ మిల్లులలో సీసీఐ (CCI) కొనుగోళ్లు కూడా తిరిగి ప్రారంభంకానున్నాయి.
ఈ విషయాన్ని రైతులు గమనించి తమ పత్తిని ప్రైవేట్ వ్యాపారస్తులకు, జిన్నింగ్ మిల్లులకు మరియు సీసీఐ వారికి విక్రయించుకోవచ్చని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం తెలిపారు.
