ఖేలో ఇండియా పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో క్రీడా సదుపాయాల అభివృద్ధికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర కార్మిక, ఉపాధి, క్రీడా శాఖ మంత్రి మన్సూక్ మాండవీయను కలిసి నిధులు మంజూరు చేయాలని కోరారు.
మంగళవారం రోజున ఉదయం ఢిల్లీకి వెళ్లిన కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్, బండి సంజయ్ కలసి కేంద్ర మంత్రి మాండవీయను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, “కరీంనగర్ రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో ఒకటిగా విద్య, క్రీడా రంగాలలో ప్రత్యేక గుర్తింపును పొందింది. క్రీడల్లో కరీంనగర్ ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కోసం ఖేలో ఇండియా లేదా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాం” అని పేర్కొన్నారు.
సునీల్ రావు, అంబేద్కర్ స్టేడియం క్రీడా సదుపాయాలను వివరిస్తూ, “1998-2000 మధ్య అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ, ప్రస్తుతం అథ్లెట్ల సంఖ్య పెరిగినందున మట్టి ట్రాక్ కారణంగా గాయాలు పెరిగాయి. అందువల్ల సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో సాధన కోసం ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని, ఓపెన్ గ్యాలరీలకు రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు.”
ఇలాంటి అభివృద్ధి చర్యలు తీసుకుంటే, కరీంనగర్ అథ్లెట్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలలో ప్రావీణ్యత పెంచుకుని దేశానికి గౌరవం తీసుకురావడానికి అవకాశం ఉంటుందని అన్నారు.
