వనపర్తి: స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ 94వ వర్ధంతిని వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు.
మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్, ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ వంటి విప్లవకారులతో కలిసి ఆజాద్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. 1928లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ను స్థాపించి, దేశ స్వాతంత్ర్యం కోసం అనేక పోరాటాలు సాగించారని చెప్పారు.
“నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతిలో మరణించను” అనే శపథాన్ని నిజం చేస్తూ తనపై తానే తుపాకీ పేల్చుకుని అమరత్వం పొందిన ఘనత చంద్రశేఖర్ ఆజాద్దని పేర్కొన్నారు. బ్రిటిష్ పోలీసుల విచారణకు సమాధానంగా “పేరు: ఆజాద్, తండ్రి పేరు: స్వాతంత్ర్యం, నివాసం: జైలు” అని చెప్పిన ఆయన ధైర్యసాహసాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో కవి పండితుడు భూరోజు గిరి రాజాచారి, వ్యాఖ్యాత డాక్టర్ నాయకంటి నరసింహ శర్మ, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గంధం నాగరాజు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు తగవుల వెంకటస్వామి, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కందికొండ శ్రీనివాసులు, రెడ్డి సేవా సంఘం నాయకుడు రఘునాథ రెడ్డి, ఎం.ఈ.ఎఫ్ నాయకుడు గాలిముడి రాములు, బుడగ జంగాల హక్కుల పోరాట సమితి నాయకుడు సతీష్, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నాయకుడు రమేష్ చారి తదితరులు పాల్గొన్నారు.
ఇంకా తాజా వార్తల కోసం: Zindagi9News.co.in
