వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో కార్మికులు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని, అందువల్ల తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఎడ్యుకేటర్ ఏ. మోహన్ రెడ్డి సూచించారు.
జమ్మికుంట మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో, జమ్మికుంట పట్టణంలో ఉన్న ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులకు వడదెబ్బపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి వడదెబ్బ లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
వడదెబ్బ నివారణ కోసం కార్మికులు రోజుకు కనీసం 10 గ్లాసుల నీరు త్రాగాలని, పని సమయంలో గొడుగు, టోపీ, తలపాగ ధరించాలని, తెల్లటి కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు. ఎండపటికీ పని చేయకుండా ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో పనులు నిర్వహించాలని చెప్పారు. డీహైడ్రేషన్ నుంచి రక్షణకు ORS ద్రావణం ఉపయోగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్మికులకు ORS పాకెట్లను పంపిణీ చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ అరుణ, ఏఎన్ఎం రజిత, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఆశ వర్కర్ రహీమా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
