మెగాస్టార్ కొణిదెల చిరంజీవి కి యునైటెడ్ కింగ్డమ్ (UK) పార్లమెంట్ అందించనున్న జీవిత సాఫల్య పురస్కారం గర్వించదగిన విషయం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, కళామతల్లి దీవెనలతో సినీరంగంలో మెగాస్టార్గా ఎదిగి, 45 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ 9 ఫిలింఫేర్, 3 నంది అవార్డులు అందుకున్న చిరంజీవి కీర్తి మరింత పెరుగుతుందంటూ పవన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
“అన్నయ్యను తండ్రి సమానంగా భావిస్తాను. నాకు జీవితంలో మార్గనిర్దేశం చేసిన వ్యక్తి ఆయనే. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు కోట్లాది మంది అభిమానులను సమాజ సేవకు ప్రేరేపిస్తున్నాయి” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇటీవలే చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న విషయం గుర్తుచేస్తూ, ఈ నెల 19న UK పార్లమెంట్ ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం అందించనున్న వార్త తనకు గర్వకారణమని తెలిపారు.
ఈ పురస్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్టాక్ పోర్ట్ ఎంపీ నవేందు మిశ్రాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
