హుజురాబాద్, మార్చి 10: మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్ష ఖరారు కావడంలో కీలక భూమిక పోషించిన అప్పటి డీఎస్పీ పద్మనాభుల శ్రీనివాస్కు తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్ అభినందనలు తెలిపారు.
సోమవారం హుజురాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎల్వి అర్జున్, 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ను అత్యంత దారుణంగా హత్య చేసిన పరువు హత్య కేసును న్యాయపరంగా సమర్థవంతంగా వ్యవహరించి, నిందితులను శిక్షించేందుకు కృషిచేసిన డీఎస్పీ శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు.
హత్య జరిగిన సమయంలో మిర్యాలగూడ డీఎస్పీగా ఉన్న శ్రీనివాస్, 8 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసి, కోర్టులో సాక్ష్యాధారాలతో నిందితులను దోషులుగా నిరూపించారని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం హైదరాబాద్ హైడ్రాలో ప్రత్యేక అధికారిగా ఉన్న శ్రీనివాస్, పరువు హత్యలను అరికట్టేందుకు తనదైన శైలిలో వ్యవహరించడం పోలీస్ డిపార్ట్మెంట్ గర్వించదగిన విషయం అని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన శిక్షలు అమలు చేయడంలో పోలీసుల పాత్ర కీలకమని, డీఎస్పీ శ్రీనివాస్ తన నిబద్ధతతో పోలీస్ డిపార్ట్మెంట్ పరువును నిలబెట్టారని ఎల్వి అర్జున్ పేర్కొన్నారు.
