ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రేరణాత్మక చర్య — జాతీయ రక్షణ నిధికి ఒక నెల జీతం విరాళం
హైదరాబాద్: ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న భారత సాయుధ దళాలకు మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ఉదాత్త నిర్ణయం తీసుకున్నారు. దేశ భద్రత కోసం సేవలందిస్తున్న సైనికులకు తాను ఒక నెల జీతాన్ని జాతీయ రక్షణ నిధికి (National Defence Fund) విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా వెల్లడించారు—
“మన దేశ ధీర సాయుధ దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, మన సరిహద్దులను, ప్రజలను రక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి అందిస్తున్న అసమాన సేవలకు చిన్న సహకారంగా, ఒక భారతీయుడిగా నేను నా ఒక నెల జీతాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందిస్తున్నాను.”
అలాగే, “ఈ పవిత్ర లక్ష్యంలో భాగస్వాములు కావాలని నా సహచరులు, పార్టీ నాయకులతో పాటు ప్రతి ఒక్క భారతీయుడిని ఆహ్వానిస్తున్నాను. మన సాయుధ దళాలకు అండగా నిలుద్దాం. విజయం మన సొంతం! జై హింద్!” అని పిలుపునిచ్చారు.
ఈ ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో దేశభక్తి భావనకు మరింత బలాన్నిచ్చేలా నిలిచింది.
జై హింద్!
