హుజురాబాద్ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ విషయంలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో పలువురు బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా జరిగిన సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కళ్యాణలక్ష్మి చెక్కులు నెలరోజుల కిందటే వచ్చినా, ఇవాళ వరకు లబ్ధిదారులకు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. చెక్కులు డేట్ అయిపోవడానికి ఒక్కరోజు ముందు మాత్రమే పంచడం పద్ధతి కాదని” విమర్శించారు.
నియోజకవర్గంలోని జమ్మికుంట, హుజురాబాద్, వీణవంక, కమలాపూర్, ఇల్లందకుంట మండలాల్లో సుమారు 200 పైచిలుకు చెక్కులు తహసీల్దార్ కార్యాలయాల్లో ఉండగానే వాటిని పంపిణీ చేయకపోవడాన్ని ప్రణవ్ తప్పుబట్టారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రీల్ లైఫ్లో కాదు, రియల్ లైఫ్లోకి రావాలని హితవు పలికారు. “రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల జీవితాలకు మేలు చేసేలా పని చేయాలి. రీల్స్ చేసేటప్పుడు సమయం ఉంటుంది, చెక్కుల పంపిణీకి మాత్రం లేదా?” అని ప్రశ్నించారు.
చెక్కులు పొందలేక బాధపడుతున్న లబ్ధిదారులు తమ మండల తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి స్వయంగా తీసుకోవాలంటూ సూచించారు. అధికారులూ సహకరించాలని కోరారు.
