ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయానికి కొత్త భవనం.. రూ.2.25 కోట్లతో నిర్మాణానికి ఆమోదం

కరీంనగర్, జూన్ 27 (జిందగీ9న్యూస్): కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయానికి కొత్త భవనం నిర్మాణానికి పరిపాలనా అనుమతి లభించింది. రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాలు, శిథిలావస్థలో ఉన్న రెవెన్యూ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించే కార్యక్రమంలో భాగంగా ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా ఎంపిక చేశారు.
మొత్తం 10 ఆర్డీవో కార్యాలయాలు, 107 తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి రూ.263.25 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.2.25 కోట్ల చొప్పున నిధులు కేటాయించగా, నిర్మాణ బాధ్యతలను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్కు అప్పగించింది. రెవెన్యూ శాఖ సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది.
ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయం ప్రస్తుతం ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలకు ఈ కొత్త భవనం పరిష్కారం కానుంది. విశాలమైన కార్యాలయ భవనం నిర్మాణంతో ప్రజలకు ఒకేచోట మెరుగైన రెవెన్యూ సేవలు అందే అవకాశం కలుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులతో ఇల్లందకుంట మండల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
