ఆరోగ్య విద్యా బోధకుడు మోహన్ రెడ్డి పదవీ విరమణ సన్మానం

జమ్మికుంట: మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దీర్ఘకాలంగా సేవలందించిన ఆరోగ్య విద్యా బోధకుడు అడిదెల మోహన్ రెడ్డి పదవీ విరమణ సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని బీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మాన మహోత్సవం నిర్వహించారు. రేపటితో ఆయన పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ, మోహన్ రెడ్డి 35 సంవత్సరాలుగా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించారని తెలిపారు. క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీకి ఆయన ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ఇటువంటి సేవాభావం కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రవణ్ కుమార్, పీఓ ఎంసిహెచ్ డాక్టర్ సనజవేరియా, వైద్యాధికారులు డాక్టర్ వరుణ, డాక్టర్ తులసీదాస్, డాక్టర్ చందన, డిప్యూటీ డెమో దుర్గారావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సదానందం, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ పంజాల ప్రతాప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
