నకిలీ బంగారంతో రూ.9.53 లక్షల రుణం.. ముగ్గురు అరెస్ట్

కల్లూరు, ఏన్కూర్: నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి రూ.9.53 లక్షల రుణం పొందిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.
ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యాంకు శాఖ మేనేజర్ కె.వి. ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా 2024 సంవత్సరంలో గోల్డ్ అప్రైజర్గా పనిచేసిన శ్రీపాది సతీష్ (A1), శ్రీపాది మౌనిక (A2 – పరారీ), రామచంద్రోజు జయమ్మ (A3), రామచంద్రోజు నరేష్ (A4) కలిసి సుమారు 242.25 గ్రాముల నకిలీ బంగారు ఆభరణాలను అసలైనవిగా చూపించి బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.9,53,000 రుణం పొందినట్లు వెల్లడైంది.
తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఆ ఖాతాలు నిరర్థక ఆస్తులుగా (NPAs) మారాయి. అనంతరం బ్యాంకు అధికారులు వేలం ప్రక్రియ చేపట్టగా, తాకట్టు పెట్టిన ఆభరణాలు నకిలీవని గుర్తించారు.
ఈ నేపథ్యంలో నిందితులైన శ్రీపాది సతీష్, రామచంద్రోజు జయమ్మ, రామచంద్రోజు నరేష్లను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచి రిమాండ్కు తరలించారు. కాగా A2 శ్రీపాది మౌనిక పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇలాంటి మోసపూరిత చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు.
