చట్టబద్ధంగానే పిల్లల దత్తత: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
ముగ్గురు చిన్నారులకు దత్తత ఉత్తర్వుల అందజేత

కరీంనగర్, మార్చి 16 (zindagi9news ప్రతినిధి):
పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన మార్గాల ద్వారానే పిల్లలను దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కరీంనగర్ శిశుగృహకు చెందిన ముగ్గురు చిన్నారులను దత్తత తీసుకున్న దంపతులకు ఆమె అధికారికంగా ఉత్తర్వులను అందజేశారు.
వివరాల్లోకి వెళ్తే..
కరీంనగర్ శిశుగృహలో సంరక్షణలో ఉన్న ఒక శిశువును సిద్దిపేటకు చెందిన దంపతులు దత్తత తీసుకోగా, మరో ఇద్దరు చిన్నారులను తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు దంపతులు దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దత్తత ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరిగిందని పేర్కొన్నారు.
అధికారుల సూచనలు:
రక్త సంబంధీకుల నుండి గానీ, లేదా శిశుగృహలు, బాలసదనాల నుండి పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆసక్తి గల వారు జిల్లా పరిషత్ ప్రాంగణంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి దుర్గాన పర్వీన్, శిశుగృహ మేనేజర్ అపూర్వ తదితరులు పాల్గొన్నారు.
