కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ ఏరియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో వాటర్ ట్యాంక్ ఎదుట రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
మృతుడు దాదాపు 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిగా గుర్తించారు. గత 15 రోజులుగా జమ్మికుంట రైల్వే స్టేషన్ పరిసరాల్లో లేబర్ పని చేస్తూ అక్కడే నిద్రిస్తున్నాడని స్థానికులు తెలిపారు. బుధవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో సూపర్ డ్రెస్సెస్ షాప్ ముందు అతను పడుకొని ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం తీవ్ర ఎండల నేపథ్యంలో వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం తెలియనున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
