అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
జీవో నెం.42కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఎంఈఓకు వినతిపత్రం

జమ్మికుంట, జూన్ 22(Zindagi9news): జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రైవేట్ పాఠశాలలు జీవో నెంబర్ 42కు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఆల్ ఇండియా స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ కరిక్యులం, యాక్టివిటీస్ పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తూ వారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి పెట్టాల్సిన విద్యాసంస్థలు అధిక ఫీజుల వసూళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నాయని అన్నారు. ప్రతి విద్యా సంవత్సరంలో ఫీజులు పెంచుతున్నప్పటికీ విద్యార్థుల ఫలితాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును పక్కనపెట్టి అధిక ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలలపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల అధ్యక్షుడు గడ్డం సత్య విష్ణు, వరుణ్, కర్మల, సాయిచరణ్, సాయికుమార్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.షార్ట్ హెడ్లైన్: అధిక ఫీజులపై ప్రైవేట్ పాఠశాలలకు చెక్ వేయాలి
