ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి.. లేకుంటే భారీ ధర్నాలు: బీజేపీ హెచ్చరిక

పెబ్బేరు, మే 21(Zindagi9News): రైతుల ప్రధాన సమస్య అయిన ధాన్యం సేకరణను వెంటనే వేగవంతం చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలకు పిలుపునిస్తామని భారతీయ జనతా పార్టీ నాయకులు మండల ఎమ్మార్వోకు హెచ్చరించారు.
భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో మండల ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో తరుగు పేరిట రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే కొనుగోలు ప్రక్రియలో జాప్యం కారణంగా అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రైతులు పండించిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా కొనుగోలు చేసి, తరుగు సమస్యలను నివారించాలని బీజేపీ నాయకులు అధికారులను కోరారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మొగిలి రాఘవేంద్ర గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రంగస్వామి గౌడ్, పెబ్బేరు మండల అధ్యక్షుడు ఆడెం నాగరాజు, జిల్లా విద్యాసెల్ కన్వీనర్ నరసింహనాయుడు, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు చింతల రామకృష్ణ, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు కశిరెడ్డి వెంకట్ రామ్ రెడ్డి, జిల్లా బీజేవైఎం నాయకులు చింతకాయల శివ, పట్టణ ప్రధాన కార్యదర్శులు సర్వేశ్వర్ గౌడ్, మోతే రాఘవేంద్ర, గోనెలా అరవింద్, బాలకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శులు గోవిందునాయుడు, శాఖాపూర్ రఘు, గంధం శివ, బలరాం, వడ్డె ప్రసాద్, వడ్డే తిరుపతయ్య, సతీష్, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
