
కేంద్ర మంత్రి కొడుకుపై హనీట్రాప్ యత్నం..? కరీంనగర్లో సంచలనం
కరీంనగర్లో రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న హనీట్రాప్ మరియు ఎక్స్టార్షన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కుమారుడిని లక్ష్యంగా చేసుకుని ఓ మహిళ పక్కా ప్రణాళికతో హనీట్రాప్కు ప్రయత్నించిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
అందిన సమాచారం ప్రకారం, సదరు మహిళ తన కుమార్తెను అడ్డుపెట్టుకుని బండి సంజయ్ కుమారుడిని వలలో వేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అనంతరం భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్కు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు బాధితుడు ఇప్పటికే కరీంనగర్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.
ఫిర్యాదులో సుమారు రూ.2 నుండి రూ.3 కోట్ల వరకు వసూలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, తప్పుడు ఆరోపణలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అలాగే, మైనర్ బాలిక పేరుతో “పోక్సో” కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపిస్తున్నారు.
ఇక డబ్బులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో, సదరు మహిళ మీడియాను ఆశ్రయించి వ్యవహారాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజకీయ మరియు ఆర్థిక ప్రయోజనాల కోణం కూడా ఉండొచ్చని చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం కేసుకు సంబంధించిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ గతంలో ఇలాంటి ఘటనల్లో పాల్గొన్నదా..? ఎవరైనా ఈ వ్యవహారం వెనుక ఉన్నారా..? అనే కోణాల్లో కూడా విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.
