
ఏసీబీ వలలో వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ
వికారాబాద్, ఏప్రిల్ 21(zindagi9news): అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరోసారి తమ ప్రతాపాన్ని చూపించారు. లంచం డిమాండ్ చేసిన వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ మరియు సబ్-ఇన్స్పెక్టర్లను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే… వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసు (Cr.No 13/2026) విషయంలో బాధితుడికి మరియు అతని కుటుంబ సభ్యులకు సెక్షన్ 35 (3) BNSS కింద నోటీసులు జారీ చేయడానికి ఇన్స్పెక్టర్ బి. సరోజ (AO-1), ఎస్ఐ హెచ్. రాణి (AO-2) లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
మొదట రూ.60,000 లంచం డిమాండ్ చేసిన అధికారులు, బాధితుడి అభ్యర్థన మేరకు దానిని రూ.40,000కు తగ్గించినట్లు సమాచారం. ఈ క్రమంలో మార్చి 23, 2026న ఇన్స్పెక్టర్ సరోజ సమక్షంలో ఎస్ఐ రాణికి బాధితుడు రూ.20,000 నగదు అందజేసినట్లు వెల్లడైంది.
తదుపరి మిగిలిన లంచం డబ్బుల కోసం అధికారులు బాధితుడిని వేధించడంతో, అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు, ఆరోపణలు నిజమని నిర్ధారించారు. అనంతరం ఇద్దరు అధికారులపై క్రిమినల్ మిస్కండక్ట్ కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో కొనసాగుతోందని, చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సింధు శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.
