
భార్య మరణం తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య: కరీంనగర్లో తీవ్ర విషాదం
కరీంనగర్/జమ్మికుంట: కరీంనగర్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకుందన్న బాధతో మనస్తాపానికి గురైన ఓ సబ్ ఇన్స్పెక్టర్ (SI) తానూ ప్రాణాలు తీసుకున్నారు. వరుస మరణాలతో ఆ కుటుంబంలో చీకట్లు అలముకున్నాయి.
ఘటన వివరాలు:
కరీంనగర్ టూటౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ యాదవ్, జమ్మికుంట మండలం సీతంపేటలోని తన అత్తగారింట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ నెల 17న ఆయన భార్య దివ్య తీవ్రమైన కడుపునొప్పి భరించలేక గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకున్నారు.
భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఎస్సై చంద్రశేఖర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆమె లేని జీవితం వద్దనుకుని తాను కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరి మరణంతో ఇద్దరు చిన్న పిల్లలు అనాథలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జమ్మికుంట ఆసుపత్రికి తరలించారు.
ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విధి నిర్వహణలో నిబద్ధతగా ఉండే అధికారి ఇలా తనువు చాలించడం పట్ల తోటి పోలీస్ సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
