
డిజిటల్ లంచావతారం: ఏసీబీకి చిక్కిన కరీంనగర్ అధికారి!
కరీంనగర్, క్రైమ్ డెస్క్:అవినీతికి అంతం లేకుండా పోతోంది. సామాన్యుల పనులు చక్కబెట్టేందుకు కొందరు అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఒక ప్రభుత్వ అధికారి భారీ స్థాయిలో లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు చిక్కారు.
ఏకంగా రూ. 14.77 లక్షల వసూలు
కరీంనగర్ జాయింట్ డైరెక్టర్ వర్క్స్ అకౌంట్స్ (WA) కార్యాలయంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న ఈగల మధుసూదన్, తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ భారీగా అక్రమ సంపాదనకు తెరలేపారు. సెప్టెంబర్ 15, 2022 నుండి సెప్టెంబర్ 20, 2023 మధ్య కాలంలో సుమారు రూ. 14,77,003 మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఏసీబీ విచారణలో తేలింది.
బినామీ ఖాతా.. UPI లావాదేవీలు
సాధారణంగా లంచం అంటే చేతులు మారే నగదు అనుకుంటాం, కానీ ఈ అధికారి తెలివిగా డిజిటల్ పేమెంట్స్ (UPI) మార్గాన్ని ఎంచుకున్నారు. తనపై నిఘా పడకుండా ఉండేందుకు భద్రాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్లో ఉన్న ఒక బినామీ ఖాతాను ఉపయోగించి ఈ నిధులను మళ్లించారు. ఫైళ్లలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి, స్క్రూటినీలో ఉన్న పత్రాలను క్లియర్ చేయడానికి ఆయన ఈ వసూళ్లకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
ఏసీబీ హెచ్చరిక: భయపడకండి.. ఫిర్యాదు చేయండి
అవినీతి రహిత సమాజం కోసం ప్రజలు సహకరించాలని ఏసీబీ అధికారులు పిలుపునిచ్చారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే వెంటనే కింది మార్గాల్లో సంప్రదించాలని కోరారు:
టోల్ ఫ్రీ నంబర్: 1064
వాట్సాప్: 9440446106
వెబ్సైట్: acb.telangana.gov.in
ఫిర్యాదు చేసిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
