
అదనపు కలెక్టర్పై అక్రమాస్తుల కేసు – ఏసీబీ దాడుల్లో కోట్ల ఆస్తులు వెలుగులోకి
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా, ఇన్చార్జ్ జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేసిన (ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న) ఎర్రమాడ వెంకట్ రెడ్డి పై అక్రమాస్తుల కేసు నమోదైంది. తెలంగాణ Telangana Anti-Corruption Bureau (ఏసీబీ) అధికారులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.
ఇటీవల లంచం తీసుకుంటూ 05 డిసెంబర్ 2025న ఏసీబీ అధికారులకు చిక్కిన నేపథ్యంలో, బుధవారం నిందితుడి నివాసంతో పాటు అతనికి, అతని బంధువులకు సంబంధించిన మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
సోదాల్లో భారీగా చర, స్థిర ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ఒక నివాస విల్లా, ఒక నివాస ఫ్లాట్, ఒక వాణిజ్య దుకాణం, ఎనిమిది ఓపెన్ ప్లాట్లు, 14.25 ఎకరాల వ్యవసాయ భూమి, మూడు నాలుగు చక్రాల వాహనాలు గుర్తించారు. అలాగే 297 గ్రాముల బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు, రూ.30,00,300/- నగదు, రూ.44,03,032/- బ్యాంకు నిల్వలు స్వాధీనం చేసుకున్నారు.
డాక్యుమెంట్ విలువ ప్రకారం మొత్తం ఆస్తుల అంచనా విలువ రూ.7,69,38,332/-గా ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఆదాయానికి మించిన ఆస్తులపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
