కరీంనగర్ ప్రజలకు శుభవార్త: జమ్మికుంటలో ఆగనున్న దక్షిణ్, రాయపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. ఈ నియోజకవర్గ ప్రయాణికుల సౌకర్యార్థం మరో మూడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఇకపై జమ్మికుంట స్టేషన్లో ఆగనున్నాయి.
హైదరాబాద్–హజ్రత్ నిజాముద్దీన్ మధ్య నడిచే దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12721/12722), సికింద్రాబాద్–రాయపూర్ మధ్య నడిచే రాయపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12771) రైళ్లు జమ్మికుంట స్టేషన్లో ఒక నిమిషం పాటు ఆగేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ నుండి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్లే రైలు: అర్ధరాత్రి 1:34 నిమిషాలకు జమ్మికుంట చేరుకుంటుంది.
హజ్రత్ నిజాముద్దీన్ నుండి హైదరాబాద్ వెళ్లే రైలు: రాత్రి 11:19 గంటలకు ఆగుతుంది.
సికింద్రాబాద్ నుండి రాయపూర్ వెళ్లే రైలు: రాత్రి 1:04 నిమిషాలకు జమ్మికుంటకు చేరుకుంటుంది.
ఈ నిర్ణయం రాబోయే ఒకటి-రెండు రోజుల్లో దక్షిణ మధ్య రైల్వే అధికారిక నోటిఫికేషన్గా విడుదల కానుంది.
గతంలో జమ్మికుంటలో రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు పలుమార్లు కోరగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవ తీసుకుని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి ఈ అంశంపై అనేకసార్లు చర్చించారు. సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
రైల్వే శాఖ నిర్ణయంపై బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధి ప్రజలకు ఈ సౌకర్యం ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. ప్రజలు కూడా బండి సంజయ్ కుమార్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
