
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం టేకుర్తి గ్రామంలో 7 నెలల గర్భిణి మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన శనివారం రాత్రి వెలుగుచూసింది. ఈ ఘోరానికి సంబంధించి పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు.
ముద్రబోయిన రాములు (40), తన రెండో భార్య ముద్రబోయిన తిరుమల (32)తో టేకుర్తిలో వేరు కాపురం పెట్టాడు. తిరుమల ప్రస్తుతం 7 నెలల గర్భవతిగా ఉంది. ఈ పరిస్థితిని అసహ్యించుకున్న రాములు, మొదటి భార్యతో కుమారులు కలిసి తిరుమలపై కక్ష్య పెంచుకున్నారు. రాముల చిన్న కుమారుడు బన్నీ తేజ (19)ను ప్రేరేపించి హత్యా యత్నం చేశారు.
ఆన్లైన్లో ముందుగానే కొనుగోలు చేసిన కత్తితో బన్నీ తేజ, తిరుమల ఒంటరిగా ఉన్న సమయంలో గొంతు కోసి, పొడిచి హత్య చేశాడు. హత్య సమయంలో గ్రామంలోని గణేష్ మండపంలో సౌండ్ ఎక్కువగా పెట్టి అరుపులు బయటకు వినిపించకుండా ప్రణాళిక సిద్ధం చేశారు.
సమాచారం అందుకున్న ఇల్లందకుంట పోలీసులు కేసు నమోదు చేసి, హుజురాబాద్ ఇన్ఛార్జ్ ఏసీపీ శ్రీనివాస్ జీ ఆధ్వర్యంలో చాకచక్యంగా దర్యాప్తు జరిపారు. పారిపోతున్న నిందితులను పట్టుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేసినందుకు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, జమ్మికుంట రూరల్ సీఐ కె. లక్ష్మినారాయణ, ఇల్లంతకుంట ఎస్సై క్రాంతి కుమార్, హుజురాబాద్ రూరల్ సీఐలు రామకృష్ణ, పులి వెంకట్, వీణవంక, సైదాపూర్ ఎస్సైలు ఏ. తిరుపతి, చి. తిరుపతిలను అభినందించారు.
