మేడ్చల్ మల్కాజిగిరి, 11 మార్చి 2025: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ డివిజన్ (127) గాంధీనగర్ బస్తీలో శివాలయాన్ని అపవిత్రం చేసి, వస్తువులు దొంగతనం చేసిన ఘటనకు నిరసనగా హిందూ సంఘాలు మరియు స్థానికులు ఆందోళనకు దిగారు.
ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించిన బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ డిల్లీ నుంచి నేరుగా దేవాలయానికి చేరుకున్నారు. హిందూ దేవాలయాలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.
ఈటల రాజేందర్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ:
•”హైదరాబాద్ చుట్టుపక్కల పదుల సంఖ్యలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. కానీ ఈ దాడులను సైకోలు, శాడిస్టులు, దొంగలు చేసినట్లు ప్రభుత్వం చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోంది” అన్నారు.
•”ముత్యాలమ్మ ఆలయం ఘటన ఉద్దేశపూర్వక దాడి” అని గుర్తుచేస్తూ, “ఇది సనాతన ధర్మంపై దాడి. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని హెచ్చరించారు.
•”గాంధీనగర్ రామలింగేశ్వర ఆలయంలో అర్థరాత్రి 3:20 గంటలకు హామీద్, ఖాజా అనే వ్యక్తులు ఆలయ తలుపులు విరగొట్టి లోనికి ప్రవేశించి, శివలింగంపై చెప్పులతో ఎక్కి అవమానపరిచారని, అక్కడున్న వస్తువులను దొంగిలించారని” తెలిపారు.
•”ధర్మంపై దాడిని నిరసిస్తూ హిందూ సమాజం కదిలి వస్తే, పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారు. నిరసనకారులను అమానవీయంగా కొట్టి, అసభ్యంగా తిడతున్నట్లు స్థానికులు చెప్పారని” ఆరోపించారు.
•”పోలీసుల పనితీరును తీవ్రంగా ఖండిస్తూ, దుర్మార్గులను కట్టడి చేయాలి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే సహించేది లేదని” స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి హెచ్చరిక:
“ఆలయాలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. మళ్లీ ఇలాంటి దాడులు జరిగితే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి” అన్నారు.
“హిందూ సమాజాన్ని పరీక్షించవద్దు. మా సహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేయకండి” అంటూ ప్రభుత్వం, పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు.
