పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యాయులు బి. నరసింహారావు
కె.యు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు కరపత్రాలు ఆవిష్కరణ
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన యూజీసీ నూతన ముసాయిదాను వ్యతిరేకిస్తూ పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలో మార్చి 18న “యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సు” నిర్వహిస్తున్నామని పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు
బి.నరసింహారావు తెలిపారు.
సోమవారం పి.డి.ఎస్.యు. కాకతీయ యూనివర్సిటీ కార్యవర్గం ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు రాష్ట్ర సదస్సుకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా బి. నరసింహారావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తుల కనుసన్నాల్లో యు.జీ.సి. నూతన ముసాయిదా రూపొందించి, భారత రాజ్యాంగం ఉమ్మడి జాబితాలో పొందుపరిచిన విద్యారంగాన్ని తన గుప్పెట్లోకి తీసుకొని విద్య రంగాన్ని పూర్తిగా కాషాయీకరించడమే కాకుండా ప్రైవేట్, కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పగించే కుట్రలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని,
వైస్ ఛాన్సలర్ ల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వల హక్కులను కాలరాసే యూజీసీ నూతన ముసాయిదాను రద్దు చేస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గత 13 సంవత్సరాలుగా యూనివర్సిటీలో శాశ్వత ప్రతిపాదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో విశ్వవిద్యాలయాల
విద్య వ్యవస్థ నిర్వహణ అగమ్య గోచరంగా తయారైందన్నారు.
నాణ్యమైన బోధన, పరిశోధనల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిపడా నిధులు కేటాయించకపోవడంతో విశ్వవిద్యాలయాలు తీవ్ర సంక్షోభంలో కోరుకుపోయి మూసివేత దిశగా పయనిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.మార్చి 18న కేయూ లో నిర్వహించే యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సుకు కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే, కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రొఫెసర్
వై.వెంకయ్య, దేశంలోని వివిధ యూనివర్సిటీ విద్యార్థుల ప్రతినిధులు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సదస్సుకు విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు బి. బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి వి. కావ్య, రాష్ట్ర నాయకురాలు పి.అనూష, నాయకులు గణేష్, యాదగిరి, పెరియార్, సౌమ్య,సాధన, శ్రీజ, చారి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
