కరీంనగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగనన, ఎస్సీ వర్గీకరణ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గాంధీ భవన్ ప్రకాశం హాల్ లో శుక్రవారం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, నియోజక వర్గ బాధ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగనన ఎస్సీ వర్గీకరణ పై పీసీసీ అధ్యక్షుడు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేపట్టని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టిందని పేర్కొన్నారు. వీటిపై పిసిసి అధ్యక్షుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని, గ్రామ గ్రామానా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కుల గణన ఎస్సీ వర్గీకరణ పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఎప్పటికప్పుడు తిప్పి కొట్టి ప్రజలకు నిజాలను వివరించాలని వారు సూచించారని తెలిపారు. కుల గణన సర్వేపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని, కులగణనతో తమ ఉనికి కోల్పోతామని బీ ఆర్ఎస్, బిజెపి నేతలు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు. గ్రామాల్లో రెండు పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని వెలిచాల రాజేందర్ రావు సూచించారు. కుల గణన ఎస్సీ వర్గీకరణ పై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రులు నేతలందరినీ ఆకట్టుకుందని రాజేందర్ రావు పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు నూకలు చెల్లాయని వారిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు.
